Neti Sakshyam - వార్తలు / విశాఖపట్నం : విశాఖ సిటీ: భారత జాతీయ జండా రూపకర్త పింగళి వెంకయ్య మన తెలుగువారే కావడం మన తెలుగోడి గొప్పతనమని ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీతా మాణిక్యం అన్నారు. ఏయు న్యాయ కళాశాలలో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆద్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశ స్వతంత్రానికి పింగళి రూపొందించిన జాతీయ పతాకం వైపు ప్రపంచ దేశాలన్నీ తొంగి చూశాయని గుర్తు చేశారు.
అంతేకాకుండా మువ్వన్నెల జెండాలో అమరి వున్న భావాలు భారత ప్రజలను చైతన్య పరిచేందుకు ఎంతో దోహదపడుతున్నాయని కొనియాడారు. ఇక విద్యార్థుల్లో దేశభక్తి జాతీయ సమైక్యత పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేపడుతున్న కార్యక్రమాలను మనస్పూర్తిగా అభినందించారు. అనంతరం ఆచార్య కె పల్లవి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగా జెండా ఉంచా రహే హమారా అంటూ చేపట్టే 25 వేల చదరపు అడుగుల జాతీయ జెండా ప్రదర్శనలో విద్యార్థులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేటి బసవ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ అహర్నిశలు కృషి చేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఆచార్యులు విజయలక్ష్మి, ఎల్ వి కే ప్రసాద్, రాజ్యలక్ష్మి, చంద్రకళ, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ సభ్యులు కర్రి నరేష్, మహమ్మద్ ఇషాక్, శివదలై, కొయ్య రామకృష్ణ, సంగ శ్రీవిద్య, ఫణీంద్ర, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam