Neti Sakshyam - వార్తలు / ఏలూరు/కొయ్యలగూడెం : దళారుల చేతిలో మోసపోయిన పోలవరం మండలానికి చెందిన కౌలు రైతులకు ధాన్యం, మొక్కజొన్న సొమ్ములు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొయ్యలగూడెం మండలం గవరవరం రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగోవ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా రైతులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ వెంటనే స్పందించి రైతులకు, కౌలు రైతులకు మొక్కజొన్న, ధాన్యం సొమ్ములు ఇప్పించేలా తగు చర్యలు చేపట్టాలని కోరారు. దళారుల మోసాలకు గురై అన్నదాతలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం మండలంలోని పలు గ్రామాల రైతులకు, కౌలు రైతులకు దళారులు చెల్లించాల్సిన 2కోట్ల 20 లక్షల రూపాయలు అందకపోవడం వలన ఖరీఫ్ సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళారుల మోసాలు అరికట్టే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలవరం,పాతపట్టి సీమ, కొత్త పట్టిసీమ,గుటాల,బంగారు పేట, కృష్ణారావుపేట, నూతన్న గూడెం, ప్రగడపల్లి తదితర గ్రామాలకు చెందిన బాధిత రైతులు కరిబండి ప్రభాకర రావు, పి.రవిచంద్రుడు, ఆకుల రాజా,ఎండపల్లి వీర్రాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam