Neti Sakshyam - వార్తలు / ఏలూరు/కొయ్యలగూడెం : ధాన్యం, మొక్కజొన్న దళారులకు అమ్మి మోసపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొయ్యలగూడెం మండలం గవరవరంలో గురువారం అన్నదాతలు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కొయ్యలగూడెం- నల్లజర్ల రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఇదిలా ఉండగా..పాత పొగాకు బోర్డు గోడౌన్స్ వద్ద దళారుల చేతిలో మోసపోయిన పోలవరం మండలం బాధిత రైతులు చేస్తున్న రిలే దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న పంటలను దళారులు కొనుగోలు చేసి మూడు నెలలు దాటిపోతున్నా సొమ్ములు చెల్లించలేదన్నారు. పోలవరం మండలంలో 137 మంది రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్న పంటలను గుటాలకు దళారి సూరిబాబు, మరొక దళారీకి ఆ దళారీ, ఇలా మరొక దళారీకి పంట మార్పిడి చేసి దాదాపు రూ 2కోట్ల 25 లక్షలు డబ్బులు చెల్లించకుండా మోసగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే రైతుల కష్టం దళారుల పాలవుతుందని కన్నీటి పర్యంతమైయ్యారు.రైతులను మోసగించిన దళారులపై చీటింగ్, క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు.
Admin
Neti Sakshyam