Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : జులై 30: పోలవరం ప్రాజెక్టును ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ చేసిన “పోలవరం మోదీ వరం” వ్యాఖ్యలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి సేవలను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు జగన్ మురారి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. 1980లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య ప్రాజెక్టుకు అంకురార్పణ చేయగా, 2004లో వైఎస్ఆర్ చొరవతో భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించారని తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే పోలవరానికి జాతీయ హోదా లభించిందని గుర్తు చేశారు. పోలవరం నిర్మాణ ఘనతను బీజేపీ తమ ఖాతాలో వేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని జగన్ మురారి ఆరోపించారు. ప్రాజెక్టుకు వైఎస్ఆర్ పేరు పెట్టాలని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో టిడిపి మద్దతు లేకుండా బీజేపీకి రాజకీయ బలం లేదని, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు తగిన నిధులు కేటాయించడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి అధిక ప్రాజెక్టులు, నిధులు వచ్చాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టమైన గడువు ప్రకటించాలని జగన్ మురారి డిమాండ్ చేశారు.
Admin
Neti Sakshyam