Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ / పెందుర్తి : జూలై 19:విశాఖ జిల్లా ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు ఐదుగురు కారులో బయలుదేరారు. గండిగుండం సమీపానికి చేరుకోగానే వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ముందువెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, కారులోని నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కారు డ్రైవర్తో పాటు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడగా, ఆయనను విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం కారణమా? లేక డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Neti Sakshyam