Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 28: ప్రజల రద్దీతో ఎప్పుడూ కళకళలాడే భీమిలి ఆర్డీఓ కార్యాలయం ఇక మరింత ఆధునిక రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శనివారం ఆధునికీకరించిన కార్యాలయాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో అత్యధిక ఫిర్యాదులు రెవిన్యూ శాఖపైనే వస్తున్నాయని, వాటిని వేగంగా పరిష్కరించి ప్రజలకు దగ్గర కావాలని అధికారులకు సూచించారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం కార్యాలయానికి అవసరమైన హంగులు సమకూర్చిన Divi's Laboratories యాజమాన్యాన్ని అభినందించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా గూగుల్ భూసేకరణ ప్రక్రియలో ముందడుగు పడటంలో ఆర్డీఓ సంగీత్ మాధుర్ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. నవీకరించిన కార్యాలయంలో సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, వార్డు కార్పొరేటర్లు గంటా అప్పలకొండ, చిన్ని కుమారి లక్ష్మి, దివీస్ మేనేజర్ సురేష్, కూటమి నాయకులు కంటుభుక్త రామానాయుడు, గంటా నూకరాజు, సరగడ అప్పారావు, గొలగాని నరేంద్ర కుమార్, దండి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam