Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : ఏప్రిల్14: విశాఖ నగరంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు గృహ విద్యుత్ స్వయం సమృద్ధిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన PM సూర్యఘర్ సోలరైజేషన్ యోజన కింద పలు ప్రాంతాల్లో రూఫ్టాప్ సోలార్ యూనిట్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఓల్డ్ సిటీ సబ్-డివిజన్ పరిధిలోని టౌన్ కొత్తరోడ్ సెక్షన్లో దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్, ఈఈ/టెక్నికల్/వీఎస్పీ మరియు డీఈఈ/ఓల్డ్ సిటీ అధికారులతో కలిసి సోలార్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ను ప్రారంభించారు. అలాగే సీతమ్మధార సబ్ డివిజన్లోని మద్దిలపాలెం సెక్షన్ పరిధిలో రెల్లివీధి ప్రాంతానికి చెందిన లబ్ధిదారురాలు అప్పయ్యమ్మ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్ను విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, SE/ఆపరేషన్ విశాఖపట్నం, EE/ఆపరేషన్ జోన్-I అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ (IAS), APEPDCL సీఎండీ ఐ. పృధ్వి తేజ్ (IAS), సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆపరేషన్ జి. శ్యాంబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలాకి శ్రీనివాసరావు తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సోలార్ యూనిట్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్, విద్యుత్ బిల్లుల భారం తగ్గడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు లభించనుందని అధికారులు తెలిపారు.
Admin
Neti Sakshyam