Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ పద్మనాభం : జూలై 18: శ్రీ అనంత పద్మనాభ స్వామి సేవా సంస్థ పద్మనాభం మండల కాంప్లెక్స్లోని ప్రభుత్వ కార్యాలయాలకు డస్ట్బిన్లను పంపిణీ చేసింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో కూడా తమ సంస్థ ముందుంటుందని సంస్థ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ గోపీరాజు (గోపీబాబు) అన్నారు. ఈ నెల 20న మండల కాంప్లెక్స్ ఆవరణలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావుచే నిర్వహించనున్న కార్యక్రమానికి కార్యాలయాల పరిసరాలను సంస్థ సభ్యులు స్వచ్ఛంగా శుభ్రపరిచారు.
అనంతరం సంస్థ సొంత నిధులతో సుమారు రూ.25 వేల వ్యయంతో కొనుగోలు చేసిన డస్ట్బిన్లను మండలంలోని ఎంఆర్వో, ఎంపీడీఓ, ఎంఈఓ, విద్యుత్ శాఖ, వెలుగు, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు, ఎంపీడీఓ బి.చిన్నారావు, తహసీల్దారు డి.శైలజ, సింహాచలం ట్రస్టుబోర్డు సభ్యుడు కె.దామోదరరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కె.రమణ, టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి రామరాజు, ఇతర నాయకులు సన్యాసిరావు, అప్పలనాయుడు, రూపాకుల రవికుమార్, ఉప్పాడ అప్పారావు, సూర్యనారాయణ, పద్దు తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam