Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జులై 17: యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు, సమాజంలో డ్రగ్స్పై చైతన్యం కల్పించేందుకు విశాఖ నగర పోలీసు కమిషనర్ శంకబ్రత బాగ్చీ సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా భీమిలిలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. భీమిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకర్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భీమిలి గంటస్తంభం వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగుతూ ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను తెలియజేసింది. అనంతరం విద్యార్థులు మానవహారంగా ఏర్పడి "డ్రగ్స్ వద్దు... చదువే ముద్దు", "మత్తుకు నో చెప్పండి – భవిష్యత్తుకు అవును చెప్పండి" వంటి నినాదాలతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా భీమిలి సిఐ దివాకర్ మాట్లాడుతూ, డ్రగ్స్ అనేది వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ భవిష్యత్తును కూడా దెబ్బతీసే మహమ్మారి అని గుర్తు చేసారు. యువత తమ లక్ష్యాలపై దృష్టి సారించి విద్య, క్రమశిక్షణ, మంచి అలవాట్లతో జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
"డ్రగ్స్కు దూరంగా ఉంటేనే యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుంది. సమాజం మొత్తం కలిసి మత్తు పదార్థాలపై పోరాటం చేస్తేనే డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది" అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.
Admin
Neti Sakshyam