Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ తగరపువలస : ఆగస్టు 11: జీవీఎంసీ ఒకటో వార్డు పరిధిలోని బంగ్లామెట్ట దళిత కాలనీలో నెలకొన్న సామాజిక సమస్యలను పరిష్కరించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం కేవీపీఎస్, సీఐటీయూ భీమిలి జోన్ కమిటీ నాయకులు కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన కె.అరుణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో తమకు ఇళ్లు మంజూరైనట్లు చెప్పారని, అయితే ఇప్పటివరకు ఇంటి స్థలం లేదా పట్టా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు ఇళ్ల విషయంలో స్పష్టత కల్పించి, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే ఇంటర్, పదో తరగతి చదువుతున్న తమ ఇద్దరు పిల్లలకు విద్యా దీవెన, తల్లికి వందనం వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందడం లేదని పలువురు మహిళలు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే కాలనీలో తాగునీటి సరఫరా ప్రస్తుతం బాగానే ఉందని పలువురు మహిళలు తెలిపారు. కాలనీ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ స్థానిక నాయకులు ఇ.రాంబాబు, సీఐటీయూ భీమిలి జోన్ కమిటీ కార్యదర్శి ఎస్.అప్పలనాయుడు, నాయకులు పంపాన సూర్యనారాయణ పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam